నా వ్యాఖ్య 1 :-
అంశం : మంచి రచనలకి ఆదరణ కావాలి
# కవి తరంగం
రాను రాను సామాజంలో కవులు /కవయిత్రులు పెరుగుతూ వస్తున్నారు . ఎవరి శైలిలో వారు మంచి మంచి రచనలు అందిస్తున్నారు ఇది చాలా సంతోషించదగ్గ విషయం . అంతకుముందు మనకు రాసేవారు తక్కువ చదివేవారు ఎక్కువ . మనకు నేడు ఉన్న సదుపాయాలు కాని ,సౌలభ్యాలు కాని ఆనాడు ఉండేవి కావు . పైగా నేడు ఆధునికంగా ,సాంకేంతికంగా కవిత్వాలు అంతర్జాలంలో కోకొల్లలు గా పుట్టుకొస్తున్నాయి . నేడు మనకు కొన్ని వెబ్ సైట్స్ మరియి మన పేరు మీదనే సొంత బ్లాగ్స్ సృష్టించుకుని మనం రాసుకున్న కధలు కాని , కవితలు కాని చక్కగా భద్రపరుచుకోగల్గుతున్నాము . పైగా మనల్ని మనమే ప్రచారం (పబ్లిసిటీ) చేసుకునేందుకు సోషల్ సైట్స్ (పేస్ బుక్ మరియు వాట్స్ ఆప్ ) ఉండనే ఉన్నాయి . కాబట్టి ఎంత చిన్న రచయిత అయినా నేడు ప్రపంచం ముందు తనకంటూ ఒక మార్క్ ను , ఒక ఫాలోయింగ్ ను నిర్మించుకోగల్గుతున్నాడు . తను రాసిన రచనలని నేడు చాలా సులభంగా కొన్ని పేరుగాంచిన పత్రికలకు పంపగల్గుతున్నాడు . ప్రజాదరణకు చేరువ కాగల్గుతున్నాడు .
అప్పట్లో కవులు /కళాకారులు కి నేడు మనకి ఉన్నంత వసతులు ఉండేవి కావు . పైగా ఒక కవి తనకి తాను నిరూపించుకోవాలంటే ఎంతో శ్రమించవలసిన పరిస్థితి కొన్ని పత్రికలకు అనుగుణంగా రాయాలి , వారు రాసినవి పోస్ట్ల ద్వారా ఆ సంబంధిత పత్రికా సంపాదకులకు పంపాలి . ఆ పంపిన రచన స్వీకరించి ప్రచురణ అయితే చదివిన వారు వారి యొక్క స్పందనలు తిరిగి ఉత్తరం రూపేణా ఆ రచయిత యొక్క చిరునామాకో (లేదా ) ఆ సంబంధిత పత్రికకో పంపితే అది చూసుకున్న ఆ రచయిత యొక్క ఆనందం వర్ణనాతీతం . ఇలా మంచి మంచి రచనల కోసం ప్రజలు ఎదురుచూసేవారు కాబట్టే మంచి మంచి కవిత్వాలు /కధలు /నవలలు /గేయాలు /....మొ //నవి పుట్టుకొచ్చాయి అలానే మంచి పేరును సంపాదించుకోగలిగాయి .
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేడు రచనలు పెరిగాయి /రచయితలు పెరిగారు కానీ వారికి ఆదరణ కరువౌతుంది అని చెప్పుకొనుట ఏ మాత్రం అతిశయోక్తి కాదు ఎందుకంటే నేడు రాసిన రచనలను చదివి స్పందించే లేరు తద్వారా రచయితలకి అవకాశాలు లేవు , రావు . ఎవరి శైలి వారిది , ఎవరి దారి వారిది . మనకి మనం రాసుకోవటం , వాటిని మనకి తెలిసిన వారితో పంచుకోవటం అంతే తిరిగి మన మన దినచర్యలో మనం మునిగిపోవటం . అస్సలు ఎవరు రాస్తున్నారు , ఏమి రాస్తున్నారు ,ఎలా రాస్తున్నారు అనేది ఎవరికీ పట్టదు . మన సొంత డబ్బా మనం కొట్టుకోవటం , మనం ఏం మీటింగ్లకి వెళ్ళాలి ఎక్కడ ఎటువంటి సత్కారాలు పొందాలి . మనకు సంబందించిన కధలు /కవిత్వాలు ఏ పత్రికలకి పంపుకోవాలి అంతే మీరు గొప్పగా ఎదుగుతున్నారు చక్కగా ప్రసగించగల్గుతున్నారు సంతోషం . ఎంతో మంది ఇలా కనీసం ఇటువంటి అవకాశాల్లో చిన్న అవకాశం కూడా రాక వారు రాసే కవిత్వాలు వారి వారి ఇళ్లల్లో చెదలు పట్టిన పుస్తకాలకో , బీడులు పడ్డ గోడలకో మాత్రమే పరిమితం అవుతున్నాయి .
ఇదేకాకుండా కవులకు ఎటువంటి ఈర్ష్యా ,అసూయ , కుల మత బేధాలు ఉండకూడదు . అది కూడా నేడు మన కవిత్వంలో విస్తృతంగా ఆవహిస్తుంది . ఒకరు బాగా రాశారు అంటే మెచ్చుకునే మనసు రాదు . ఒక చిన్న చిన్న కవులు మనముందు ఎదుగుతున్నారంటే వారిని పలకరించటానికి మనకు మన అహం అడ్డు చెప్తుంది . పైగా అప్పటి నుండి వారిని కాస్త పక్కకు పెట్టాలని చూస్తూ ఉంటాం .కవులు సమాజానికి సన్నిహితులు , ప్రతీ కవిలో నుంచి ఏదో ఒక కొత్త పదార్ధం కవితలా పుట్టి , అది మంచి సూచన గా మారి మనల్ని యోచన చేసేలా చేస్తుంది . ప్రతీ కవి అవసరం ఈ సమాజానికి ఉంది . ఎదిగినా కవులు చిన్న కవులపై ప్రేమను చూపి , మీ యొక్క ఆత్మీయతను పంచి వారికి చేయూతగా మీ హస్తాన్ని అందించింది . మీ యొక్క చిరు ఆదరణ ను వారిపై చూపి వారికి మంచి ప్రోత్సాహకాలను అందించండి . అస్సలు ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ,సరదాగా తోటి వారి రచనలను చదువుతూ వారి కవితకు చిన్న అభినందనతో ఒక సమీక్ష రాస్తే అటువంటివి ఇంకా ఇంకా మనకు రాయాలని పిస్తుంది .అటువంటి రచనలు చదువుతుంటే కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవటం తో పాటు , మనకు ఒక మంచి తృప్తి , ఆనందం కలుగుతాయి . కాబట్టి స్పందన ఉంటుంది మనకు మంచి మనసు ఉంటుంది ఆ మనసుతో చిన్నగా స్పందిస్తే కొన్ని మంచి రచనలకు అది తోరణమై మరో రచనకు శ్రీకారం అవుతుంది.
- జై తెలుగు జయహో కవిత్వం
(గరిమెళ్ళ రాజేంద్రప్రసాదు )
,